
భారత్ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళంలో తొలి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ రాజుపుత్ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ అపూర్వ ఘట్టానికి విశాఖపట్టణంలోని నావల్ డాక్యార్డ్ వేదిక కానుంది. ఈ యుద్ధనౌకను ఒకప్పటి సోవియట్ యూనియన్ నిర్మించింది. ఆనాటి భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ ఆధ్వర్యంలో 1980, మే 4న జార్జియాలోని పోటి వద్ద ఇండియన్ నేవీలో చేరింది. అప్పటి నుంచి ఎన్నో విలువైన సేవలను అందించింది. ఈ యుద్ధనౌకకు తొలి కమాండింగ్ ఆఫీసర్గా కెప్టెన్ గులాబ్ మోహన్లాల్ హీరారందానీ వ్యవహరించారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ కొద్ది మంది సిబ్బంది సమక్షంలో విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తూర్పు, పడమర తీరాల్లో సేవలందించిన యుద్ధనౌకగా ఐఎన్ఎస్ రాజ్పుత్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు యుద్ధాల్లో పాల్గొనడమే కాకుండా.. ప్రయోగ దశలో బ్రహ్మోస్ క్షిపణికి పరీక్ష వేదికగా ఈ నౌక వ్యవహరించింది. పలు దేశాల ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో సత్తా చాటింది. 41 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈ నౌకకు 31 మంది కమాండింగ్ ఆఫీసర్లుగా పని చేశారు. భారత సైనిక దళంతో కలిసి పని చేసిన తొలి యుద్ధనౌక కూడా ఇదే.





