
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వీటిపై తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.
‘నోటా’కు అత్యధిక ఓట్లు పోలైన సందర్భంలో ఆ నియోజక వర్గంలో పోలింగ్ రద్దు చేసి, మళ్లీ ఎన్నిక జరిపించాలని కోరుతూ భాజపా నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా నోటాపై అభిప్రాయాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవ్యాధి మేనకా గురుస్వామి, ప్రస్తుతం అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కు మాత్రమే (రైట్ టు రిజెక్ట్) ఉందని, కానీ, దీన్ని ఓటుగా గుర్తించాలని (రైటు టు రికగ్నైజ్) వాదించారు. కనీసం 50శాతం నోటా ఓట్లనైనా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 99శాతం నోటాకు ఓట్లు పడినా, ఒక్కశాతం ఓట్లలో మెజారిటీ పొందిన అభ్యర్థి విజయం సాధించే వీలుంది.
ఎన్నికల బరిలో ఉండే ఏ వ్యక్తీ తనకు నచ్చని సందర్భంలో ‘నన్ ఆఫ్ ది అబోవ్(నోటా)’ ఆప్షన్కు ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత పలుచోట్ల అభ్యర్థులకు వ్యక్తిగతంగా పోలైన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడుతున్న విషయం చూస్తూనే ఉన్నాం.





