
సరిహద్దు వివాదంతో లడ్డాఖ్ లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
‘ఈ తెల్లవారుఝామున పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వైపు ఓ చైనా సైనికుడిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ జవాను వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి రాగా బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయి’ అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ఆ సైనికుడిని విచారిస్తున్నామని, సరిహద్దు దాటాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. జవాను గురించి చైనా సైన్యానికి కూడా సమాచారం అందించినట్లు వెల్లడించారు.
కాగా చైనా జవాను భారత భూభాగంలోకి రావడం గత నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబరులో తూర్పు లడ్డాఖ్ లోని డెమ్ చోక్ సెక్టార్లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల దర్యాప్తు అనంతరం ఆ జవాను తిరిగి తమ దేశానికి వెళ్లాడు. లడ్డాఖ్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.