News

‘గో విజ్ఞాన్‌’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం

Holy Cow and its Calf
639views

గోవు గురించి జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ‘గో విజ్ఞాన్‌’ లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్‌లైన్‌ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ ‘కామధేను గో విజ్ఞాన్‌ ప్రచార్‌ ప్రసార్‌ పరీక్ష’ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ (ఆర్కేఏ) చైర్మన్‌ వల్లభ్‌ భాయ్‌ కథిరియా వెల్లడించారు. మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పరిధిలోకి వచ్చే ఈ సంస్థను ఫిబ్రవరి 2019లో ఏర్పాటు చేశారు. దేశంలో ఆవుల సంరక్షణ, పోషణ, వాటి సంతతి అభివృద్ధి లక్ష్యంగా ఈ సంస్థ విధులు నిర్వహిస్తోంది.
ఎవరికి అవకాశం..

దీనిలో పాఠశాల, కాలేజీ విద్యార్థులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని.. పరీక్ష ఫీజు ఉచితమని ఆర్కేఏ చైర్మన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ఫలితాలను వెంటనే ప్రకటించి, అర్హులైన వారికి ధ్రువీకరణ కూడా అందచేస్తారు. అంతేకాకుండా ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు కూడా ఉంటాయట.

విద్యార్థులు, సామాన్య ప్రజల్లో దేశీయ ఆవులు, వాటి ప్రాముఖ్యతే కాకుండా.. పాలివ్వని ఆవుల వల్ల కూడా లభించే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అందించి, ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపకరిస్తుందని కేంద్రం అంటోంది. ఇందుకు సంబంధించిన స్టడీమెటీరియల్‌ను కూడా తయారు చేసినట్టు ఆర్కేఏ వెల్లడించింది. అంతేకాకుండా గోవు సంబంధిత అంశాలను గురించి పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు.. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మంచి స్పందన లభించిందని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ చైర్మన్‌ కథిరియా వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.