
దేశ రాజధానిలో భారీ దాడులకు ఉగ్రవాదులు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్ కాలేఖాన్ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ముమ్మర తనిఖీలు చేపట్టింది. సోమవారం రాత్రి పక్కా ప్రణాళిక చేపట్టి సరయ్ కాలే ఖాన్ ప్రాంతంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జమ్ముకశ్మీర్కు చెందిన అబ్దుల్ లతిఫ్ మీర్, అష్రఫ్ ఖటానాగా గుర్తించారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు పనిచేస్తున్న వీరు గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. భారత ఆర్మీ వీరిని అడ్డుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇప్పుడు ఢిల్లీలో దాడులు జరిపి ఆ తర్వాత నేపాల్ మీదుగా పీఓకే వెళ్లాలని వీరు పథకం పన్నినట్లు సమాచారం. కాగా.. ఈ కుట్రలను పోలీసులు భగ్నం చేసి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకొన్నారు.
గత ఆగస్టులో కూడా ఇలాంటి కుట్రనే ఢిల్లీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో దౌలా ఖాన్ ప్రాంతంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 15 కేజీల అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.





