
మంచులో చిక్కుకుపోయిన పది మంది పౌరులను భారత సైన్యం రక్షించింది. జమ్మూకశ్మీర్లో రెండు రోజులుగా పెద్దఎత్తున మంచు కురుస్తుండటంతో అనేక రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి పది మంది జాతీయ రహదారి- 244 సింథన్ మార్గంలో ఓ వాహనంలో వెళ్తుండగా ఆ మార్గాన్ని మంచుకమ్మేసింది. దీంతో ఇద్దరు మహిళలు, చిన్నారులతో ఉన్న 10 మంది బృందం ప్రమాదంలో పడింది. ఈ సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో దాదాపు ఐదు గంటల పాటు చీకట్లో కిలోమీటర్ల మేర నడిచి మంచులో చిక్కుకుపోయిన వాళ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం వాళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ పది మందికి వసతి కల్పించడంతో పాటు ఆహారం కూడా అందించారు. ఇదిలా ఉంటే వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల కశ్మీర్లోని పర్వత ప్రాంతాలైన గుల్మార్గ్, పహల్గమ్ తదితర ప్రాంతాలను మంచు కప్పేసింది. సోమవారం శ్రీనగర్లో భారీ వర్షాలు కురవడంతో పాటు 2.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.





