News

అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం

492views

ల్‌ ఖైదాకు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్‌ సైనికులు హతమార్చారు. ఈ ఉగ్రసంస్థే 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రెండో కీలక వ్యక్తిగా చెప్పుకునే అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు ముహమ్మద్‌ అల్‌-మస్రీని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధుల్లో సేనలు హతమార్చినట్లు చెప్పిన నిఘా వర్గాల సమాచారాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. ఆగస్టు 7న ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసినట్లు తెలిపింది. అయితే, దీని వెనుక అమెరికా సైన్యం పర్యవేక్షణ ఉందా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. అప్పట్లోనే దీనిపై స్థానికంగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఇటు ఇరాన్‌ ప్రభుత్వంగానీ, అటు అమెరికాగానీ స్పందించలేదు. అల్‌ ఖైదా సైతం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్‌-మస్రీనే అన్న ఆరోపణ ఉంది.

అల్‌-మస్రీతో పాటు అతని కుమార్తె మరియంను కూడా సేనలు హతమార్చాయి. అల్‌-ఖైదా వ్యవస్థపాకుడు ఒసామా బిన్‌-లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ భార్యే మరియం. హమ్జా బిన్‌ లాడెన్‌ను అమెరికా సేనలు అంతమొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అల్‌-ఖైదా చీఫ్‌ అయమన్‌ అల్‌ జవహరీ తర్వాత ఆ పగ్గాలు అల్‌-మస్రీనే చేపడతారని అంతా భావించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో అల్‌ మస్రీ కూడా ఒకడు. ఇతనిపై 10 మిలియన్ల రివార్డు కూడా ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.