
భారత్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వ వెన్నుదన్నులున్నాయన్న సంగతి మరోసారి రుజువైంది. అది కూడా సాక్షాత్తూ పాక్ పార్లమెంటు సాక్షిగా.
జమ్ము కాశ్మీర్లో పుల్వామా దాడిని తామే చేయించినట్టు పాకిస్తాన్ సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి స్వయంగా పాకిస్థాన్ పార్లమెంట్ లో వెల్లడించారు. గురువారం పార్లమెంట్ సమావేశాల్లో ఫవాద్ మాట్లాడుతూ ” భారత్ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం.. పుల్వామాలో మనం విజయం సాధించాం. ఇది ప్రదాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంతో సాధించిన విజయం. ఇందులో మనమంతా భాగస్వాములం” అని అన్నారు.
అయితే అంతకు ముందు రోజు అసెంబ్లీలో పాకిస్తాన్ విపక్ష నేత అయాజ్ సాదిక్ మాట్లాడుతూ “భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్ బంధించినప్పుడు జరిగిన అఖిల పక్ష నేతల అత్యవసర సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కాళ్ళు వణకడం, భయంతో ముచ్చెమటలు పట్టడం తాను గమనించినట్టు” తెలిపారు.
“అభినందన్ను వెంటనే విడుదల చేద్దాం…. లేదంటే భారత్ ఈ రాత్రి 9 గంటలకు మనపై దాడి చేస్తుంది” అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఆందోళన చెందినట్టు సాదిక్ వెల్లడించారు. ఈ వాఖ్యలపై పాక్ మంత్రి పవాద్ స్పందిస్తూ అసలు పుల్వామా దాడిని ఇ్తామ్రాన్ ఖాన్ సర్కారే చేయించినట్టు అసెంబ్లీలో స్పష్టం చేశాడు.
పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాత్సవ స్పందిస్తూ ఉగ్రవాదానికి మద్దతు విషయంలో పాక్ బుద్ది గురించి యావత్ ప్రపంచానికి తెలుసునని పేర్కొన్నారు. ఐరాస గుర్తించిన ఉగ్రవాదుల్లో చాలామందికి పాకిస్తాన్ ఆశ్రయమిచ్చిందని ఆయన ఆరోపించారు.
ఈ విధంగా పాకిస్థాన్ పార్లమెంట్ లో విపక్ష, అధికార పక్ష సభ్యులు పరస్పర దూషణల మధ్య అనేక నిజాలు బయటపెట్టేశారు. అందులో ఒకటి భారత్ కు భయపడే అభినందన్ వదిలిపెట్టడం, రెండు, పుల్వామా దాడి చేయించడం. దీనితో ఇప్పటివరకూ, పాకిస్థాన్, అలాగే మన దేశంలో కొందరు, శాంతిని కోరుకుంటూ పాక్ అభినందన్ ను విడుదల చేసిందని, పుల్వామా దాడిలో ఆ దేశానికి సంబంధం లేదంటూ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.





