
న్యూజిలాండ్లో జరిగిన ఎన్నికల్లో ఓ భారతీయుడు విజయకేతనం ఎగురవేశారు. 33 ఏళ్ల డాక్టర్ గౌరవ్శర్మ హామిల్టన్ వెస్ట్ ప్రాంతం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 20 ఏళ్ల క్రితం హిమాచల్ప్రదేశ్ నుంచి వెళ్లి న్యూజిలాండ్లో స్థిరపడ్డ గౌరవ్ అధికార లేబర్ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయనకు మొత్తంగా 16,950 ఓట్లు పోలవ్వడంతో ప్రత్యర్థి టిమ్ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో జయకేతనం ఎగురవేశారు. హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్ సైతం గౌరవ్శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లోని హామిర్పుర్ జిల్లాకు చెందిన గౌరవ్ 9వ తరగతి చదువుతున్నప్పుడే 20 ఏళ్ల క్రితం ఆయన కుటుంబం న్యూజిలాండ్కు వలస వెళ్లింది. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగాన్ని వదిలేసి గౌరవ్ తండ్రి కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారు. అయితే వారు అక్కడ అనేక కష్టాలు పడ్డారు. మొదటి ఆరేళ్లపాటు గౌరవ్ తండ్రికి ఎలాంటి ఉద్యోగం లభించలేదు. అయితే, ఎట్టకేలకు ఓ ఉద్యోగం సాధించి హామిల్టన్లో స్థిరపడ్డారు. వైద్యవిద్య పూర్తిచేసిన గౌరవ్ ప్రస్తుతం నవ్టన్ నగరంలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు.
ప్రజల కష్టాలపై గళమెత్తే గౌరవ్ పలు దేశాల్లోని శరణార్థుల హక్కులకోసం పోరాడారు. 2015లో నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు. వారు నివాసాలు ఏర్పరుచుకునేందుకు తోడ్పాటునందించారు. కరోనా కాలంలో హామిల్టన్లో విశేష సేవలందించారు. ప్రజలు మహమ్మారి నుంచి కోలుకునేందుకు తీవ్ర కృషి చేశారు. ఆ కృషికి మెచ్చి హామిల్టన్ వెస్ట్ ప్రజలు గౌరవ్శర్మకు విజయాన్ని కట్టబెట్టారు.
న్యూజిలాండ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేనివిధంగా ప్రజలు ఏకపక్షంగా అధికార పగ్గాలు అప్పగించారు. గతంలో మెజారిటీ సాధించిన పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసుకొని పరిస్థితి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో ప్రజలు లేబర్ పార్టీకి పూర్తి మెజారిటీని అందించారు.





