
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి అతడు ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు తెలిపారు. పాక్ నుంచి అతడికి భారీగా నగదు అందుతోందని వెల్లడించారు. కుల్జీత్ను అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, పలు సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ఫోన్లలో సాంబ జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు ఉన్నట్లు కనుగొన్నారు. సాంబ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ శర్మ మాట్లాడుతూ దేశద్రోహం కేసులో కుల్జీత్కుమార్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పాక్తో అతడి గూఢచర్యం ఎలా మొదలైంది, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం చేరవేశాడు అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





