
సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పరోక్షంగా దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
రఫేల్ యుద్ధ విమానాలు సహా, సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్క్రాఫ్ట్, చినూక్, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందన్నారు. భవిష్యత్తుల్లో జరిగే సైనిక ఘర్షణల్లో విజయం సాధించాలంటే వైమానిక శక్తి కీలకం అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్వహించడం అత్యంత ముఖ్యం అన్నారు. రెండు స్క్వాడ్రన్ల లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నారు.





