News

ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం సంచలన నిర్ణయం

651views

రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో వెల్లడించారు. తోమర్‌ మాట్లాడుతూ.. ‘మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు సీసీఈఏ ఆమోదించింది. అందులో భాగంగా గోధుమపై ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.50 పెంచుతూ.. ధరను రూ.1,975 గా నిర్ణయించింది. అదేవిధంగా శనగపై రూ.250, మసూర్‌ పప్పుపై రూ.300, ఆవాలపై రూ.225 (క్వింటాలుకు) ఎంఎస్‌పీ పెంచేందుకు ఆమోదించింది. ఎంఎస్‌పీ, మార్కెట్‌ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కనీస మద్దతు ధరపై తోమర్‌ చేసిన ప్రకటనతో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు సభలో నుంచి వెళ్లిపోయారు.

రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి రెండు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా ఒకవైపు ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతుండగా.. మరోవైపు కేంద్రం ఎంఎస్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.