News

ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జిషీటు దాఖలు

479views

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు. మొత్తం 10వేల పేజీలున్న ఈ ఛార్జిషీటును పోలీసులు కర్కర్‌దూమ న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఇటీవల అరెస్టైన ఉమర్‌ ఖలీద్‌ సహా షర్జీల్‌ ఇమామ్‌ పేర్లను తాజా నిందితుల జాబితాలో పోలీసులు పేర్కొనలేదు.

గత కొద్ది రోజుల కిందట విడుదలైన అనుబంధ ఛార్జిషీటులో వారి పేర్లు ఉండటంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ కుశ్వాహ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన హింస ‘ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రే’ అని తమ విచారణలో తేలిందని చెప్పారు.

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం చెందారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత తాహిర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.