
దేశ రక్షణ, సైన్యం నేపథ్యంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు దేశభక్తిని గుర్తు చేస్తుంటాయి. పాక్పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరి’ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత ఇదే ఫార్ములాను వెబ్సిరీస్లు ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ నేపథ్యంలో పలు వెబ్సిరీస్లు వచ్చి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇకపై సైన్యం, దేశ రక్షణ నేపథ్యంలో తీసే సినిమాలు, వెబ్సీరీస్లు, డాక్యుమెంటరీలు ఏవైనా.. రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ) తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల కొన్ని వెబ్సిరీస్లు సైనికుల మనోభావాలు, సైన్యం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీశారని కేంద్రం దృష్టికి వెళ్లింది. ముఖ్యంగా ఆల్ట్ బాలాజీ నిర్మాణ సంస్థ తీసిన ఓ వెబ్సిరీస్లో సైనికుల మనోభావాలను కించపర్చే విధంగా ఉన్నాయని సంస్థపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సైన్యం గౌరవం కాపాడటం కోసం.. ఇకపై సైన్యం నేపథ్యంలో తీసే ఏ ఫార్మాట్ చిత్రాలైనా విడుదల చేసే ముందు రక్షణ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాలని నిబంధన విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ), సమాచార మంత్రిత్వ శాఖకు రక్షణ శాఖ లేఖ రాసిందట. దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో సైన్యం గౌరవానికి భంగం కలిగేలా సన్నివేశాలను చిత్రీకరించొద్దని సూచించిందట.





