
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్లో మొదటిసారి కలవడం గమనార్హం.
పాక్ ఏజెంట్లు 2016లో కుల్భూషణ్ను ఇరాన్ నుంచి అపహరించారు. గూఢఛర్యం కేసులో 2017 ఏప్రిల్లో పాక్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దానిని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. 2017, మే 18న కోర్టు మరణశిక్షపై స్టే విధించింది. రెండు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుచేస్తూ 2019, జులై 17న తీర్పు ఇచ్చింది.
ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అందుకు జాదవ్ నిరాకరిస్తున్నారని పాక్ కథలు చెప్పింది. తొలుత పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ప్రక్రియను కొనసాగించేందుకే మొగ్గు చూపిస్తున్నారని పాక్ విదేశాంగ మంత్రి మీడియాకు చెప్పారు. అయితే భారత్ ఇందుకు అంగీకరించలేదు. జాదవ్ను కలిసేందుకు భేషరతుగా అనుమతి ఇవ్వాలని అడిగింది. తాజాగా రెండోసారి న్యాయవాది ద్వారా కలిసేందుకు దౌత్యవేత్తలకు అనుమతి దొరికిందని తెలిసింది.





