
పాకిస్థాన్ నుంచి 250-300 మంది ముష్కరులు నియంత్రణ రేఖ దాటి భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు.
భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు శనివారం మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తర కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటేందుకు వీరు విఫలయత్నం చేశారు. వారి కదలికలను గుర్తించిన సైన్యం మెరుపుదాడి చేసింది. రెండు ఏకే47 తుపాకులు, ఆయుధ సామగ్రి, పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది.
నౌగామ్ ఘటన తర్వాత మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల్లోని పాక్ లాంచ్ప్యాడ్లు పూర్తిగా నిండిపోయాయని ఆయన తెలిపారు. కనీసం 250-300 ఉగ్రవాదులు అక్కడున్నారని తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. అనుమానాస్పద కదలికలు ఉండటంతో సైనికులు మెరుపు దాడులు చేస్తున్నారని వివరించారు. నౌగామ్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించారు.





