
జమ్మూ-కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఒకరు కమాండర్ స్థాయి ఉగ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు భారత సైనిక దళానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, 183 బెటాలియన్ సీఆర్పీఎఫ్కు చెందిన బలగాలు పాల్గొన్నాయి.





