
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని భూముల మరియు ఇతర ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవదాయ ధర్మదాయ శాఖ వారు తీర్మానం చేయాలని, ఎండోమెంట్ భూములను అమ్మకుండా, అన్యాక్రాంతం చేయకుండా రక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని కోరుతూ రాష్ట్రంలోని హిందువులందరూ 30 మే శనివారం సాయంత్రం గం.6.30 నుండి గం.7.30 వరకు ప్లకార్డుల ద్వారా తమ ఆకాంక్షను తెలుపుతూ, సరిగ్గా 7 గంటల సమయంలో ప్రతి ఇంటి ముందు 7 దీపాలు వెలిగించి 3 నిముషాల పాటు ఘంటానాదం చేయవలసిందిగా హిందూ ధార్మిక మండలి పిలుపునిచ్చింది. ఈ మేరకు వారు ఒక ప్రకటనను విడుదల చేశారు.



హిందూ ధార్మిక మండలి, ఆంధ్ర ప్రదేశ్ వారి ప్రకటన యధాతధంగా…….
టి.టి.డి బోర్డు నిర్ణయాన్ని స్వాగతిద్దాం
హిందూ బంధువులారా..
టి.టి.డి.బోర్డు 28 మే 2020న భక్తులు సమర్పించుకున్న కానుకల,ఆస్తుల యొక్క అమ్మకాన్ని నిషేధిస్తూ తీర్మానించడం హిందూ దేవాలయ పరిరక్షణలో ఒక ముందడుగుగా భావించదగ్గ పరిణామం.
ఇదే విధమైన తీర్మానాన్ని ఎండోమెంటు శాఖ చేయాలనీ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాలకు భక్తులు సమర్పించుకున్న భూములను,ఆస్తులను పరిరక్షించాలనీ హిందూ సమాజం కోరుకుంటోంది.
ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంటు భూములను అమ్మకుండా,అన్యాక్రాంతం చేయకుండా తక్షణమే చట్టం చేయవలసిందిగా హిందూ సమాజం కాంక్షిస్తోంది.
30 మే శనివారం సాయంత్రం గం.6.30 నుండి 7.00 వరకు మన ఈ ఆకాంక్షను ప్లకార్డుల ద్వారా, హిందూ దేవాలయ పరిరక్షణా దీక్ష ద్వారా ప్రభుత్వానికి తెలుపుదాం.
టి.టి.డి బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తూ 7 గంటలకు 7 దీపాలు వెలిగించి 3 నిమిషాలు ఘంటానాదాన్ని చేద్దాం. హిందూ దేవాలయ భూములను,ఆస్తులను పరిరక్షించుకునే సంకల్పాన్ని,శక్తిని ప్రతీ హిందువుకు, ప్రభుత్వానికి కలిగించవలసిందిగా ఏడుకొండల స్వామిని భక్తితో ప్రార్థిద్దాం.





