News

అర్నాబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ దాడి

1.1kviews

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ముంబైలోని తన స్టూడియో నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించారు. టీవీలో తన ప్రదర్శన ముగిసిన తర్వాత తన భార్య మరియు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ సమ్యబ్రాతా రే గోస్వామితో కలిసి తమ టయోటా కరోల్లా కారులో వెళుతుండగా అర్నాబ్ ఇంటి నుండి 500 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని రిపబ్లిక్ వరల్డ్ నివేదించింది.

ఒక వీడియోలో, గోస్వామి ఈ దాడికి కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని బాధ్యులుగా అర్నాబ్ అభివర్ణించారు. ఈ దాడిని “పిరికివాళ్ళ చర్య” గా ఆయన అభివర్ణించారు. “రాత్రి 12:15 గంటలకు, నేను నా భార్యతో కలిసి స్టూడియో నుండి తిరిగి వెళ్తున్నాను. నా కారును ఇద్దరు వ్యక్తులు రెండు బైకుల్లో అధిగమించారు. వారు నా వైపు తిరిగారు, నా వైపు చూపించారు, వారు కారు అద్దాన్ని కొట్టడం ప్రారంభించారు కారు విండోను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు.” అని అతను చెప్పాడు. వారు వాహనంపై ఒకరకమైన ద్రవాన్ని విసిరారని ఆయన అన్నారు. వారు తనపై దాడి చేయడానికి ప్రత్యేకంగా పంపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అని తనకు తన భద్రతా సిబ్బంది తెలిపారని గోస్వామి తెలియజేశారు. “వారు నన్ను వెంబడించారు. నాపై దాడి చేయడానికి వారిని కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు పురమాయించారు. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సోనియా గాంధీజీ, మీరు ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పిరికివారు. నన్ను ఎదుర్కోవటానికి మీకు ధైర్యం లేదు. నాకు ఏదైనా జరిగితే, సోనియా గాంధీనే బాధ్యత వహిస్తారు.” అంటూ అర్నాబ్ ఆవేశంగా స్పందించారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో హిందూ సన్యాసులపై జరిగిన దాడి/హత్య   గురించి రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక చర్చలో, అర్నాబ్ ఈ సంఘటన విషయంలో సోనియా గాంధీ నిశ్శబ్దంపై ప్రశ్నించారు. ఆమె ఇప్పుడు “సంతోషంగా” ఉందని, అదే మైనారిటీ వర్గానికి చెందిన వారిపై దాడి జరిగివుంటే సోనియా ఇలా నిశ్శబ్దంగా ఉండరని ఆర్నాబ్ ఆ షోలో వ్యాఖ్యానించారు. ఇది అనేక మంది కాంగ్రెస్ నాయకుల నుండి విమర్శలను రేకెత్తించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా “ఈ బ్రాండ్ టివి యాంకర్లను పిఎమ్ & బిజెపి ప్రశంసించడం చాలా అవమానకరం” అని ఆరోపించారు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోనియాకు వ్యతిరేకంగా గోస్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అత్యంత విజయవంతమైన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని అభివర్ణించారు.

కొన్ని రోజుల క్రితం, గోస్వామి తాను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లుగా తన చానల్లో ఒక లైవ్ షోలో ప్రకటించారు. ఎడిటర్స్ గిల్డ్ పాల్ఘర్ సంఘటన విషయంలో కపటత్వానికి పాల్పడినట్లు ఆరోపించారు. తన ప్రసిద్ధ ప్రైమ్‌టైమ్ వార్తా చర్చలో, గోస్వామి ఇది “పొరపాటుగా జరిగిన సంఘటన” కాదు. సంఘటన వెనుక ఉద్దేశాలు “స్పష్టంగా ఉన్నాయి” అని అన్నారు. ” నన్ను దాని గురించి సూటిగా చెప్పనివ్వండి. ఇదే సంఘటన బిజెపి పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే, మరియు హిందువులకు బదులు మైనారిటీలెవరైనా బాధితులు అయ్యుంటే… [నటుడు] నస్సీరుద్దీన్ షా, అపర్ణ సేన్, [చరిత్రకారిణి] రామ్‌చంద్ర గుహా, [సంపాదకుడు] సిద్ధార్థ్ వరదరాజన్, మరియు అవార్డు వాప్సీ ముఠా, వారు ఈ రోజు ఎంత తీవ్రస్థాయిలో వెళ్ళేవారు [స్పందించి ఉండేవారు]?

“శేఖర్ గుప్తా, మీరు నా మాటలు వినండి. ఎంతో కొంత మిగిలివున్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా యొక్క విశ్వసనీయత ఈ సంఘటనపై నిశ్శబ్దం ద్వారా నాశనం చేయబడింది. ఇది స్వయంసేవా సంస్థగా మారింది. నేను చాలాకాలంగా ఎడిటర్స్ గిల్డ్‌లో సభ్యుడిని. సంపాదకీయ నీతి నియమాల విషయంలో ఎడిటర్స్ గిల్డ్ పూర్తిగా రాజీ పడిన కారణంగా నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ”అని ఆయన ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.