
0views
సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన స్వదేశీ డైవింగ్ సహాయక నౌక (డీఎ్సవీ) ‘ఐఎన్ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో నావికాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సమక్షంలో ఈ నౌకను అధికారికంగా ప్రారంభించారు. గతేడాది ప్రారంభించిన ‘ఐఎన్ఎస్ నిస్తార్’ తర్వాత నేవీలో చేరిన రెండో డైవింగ్ సహాయక నౌక ఇది. ఐఎన్ఎస్ నిపుణ్ను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 10,500 టన్నుల బరువు మోసే సామర్థ్యం దీనికి ఉంది. సముద్ర గర్భంలో 300 మీటర్ల లోతు వరకూ వెళ్లి డైవింగ్ ఆపరేషన్లు నిర్వహించగలదు. వీటితోపాటు ప్రమాదంలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.





