News

షరియా కంటే రాజ్యాంగమే ఉన్నతం : VHP

2views

ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన “రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం”ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని, ఇక్కడ షరియా కంటే రాజ్యాంగమే అత్యున్నతమైనదని VHP కేంద్ర సంయుక్త కార్యదర్శి విజయ్ శంకర్ తివారీ పేర్కొన్నారు.షరియాకు రాజ్యాంగంతో సమానమైన హోదాను కల్పిస్తూనే రాజ్యాంగం గురించి ప్రస్తావించే సంస్థలు “దేశ సమగ్రతతో చెలగాటం ఆడుతున్నాయని” తివారీ అన్నారు.

భారతదేశంలోని ముస్లింలు భారత పౌరులని, రాజ్యాంగం హామీ ఇచ్చిన అన్ని హక్కులను అనుభవిస్తున్నారని అన్నారు. అయితే, పౌరసత్వంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. దేశ చట్టాలను అంగీకరించడం, జాతీయ చిహ్నాలను గౌరవించడం, ఉమ్మడి పౌర స్మృతి స్ఫూర్తిని అర్థం చేసుకోవడం కూడా పౌరసత్వంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

ముస్లింలు వేధింపులకు గురవుతున్నారని, మసీదులు, మదర్సాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, బుల్డోజర్లను కేవలం వారిపైనే ప్రయోగిస్తున్నారని, వందేమాతరం వారి మతంపై దాడి అని బోర్డు పదేపదే చిత్రీకరిస్తోందని తివారీ అన్నారు. ఇది అసంపూర్ణమైన, తప్పుదోవ పట్టించే కథనాలని ఆక్షేపించారు.ఏ మతాన్నైనా రక్షించే పేరుతో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు మరియు కోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని సమర్థించలేమని ఆయన అన్నారు. “చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది” అని పేర్కొన్న ఆయన, అక్రమ చర్యలను చట్టబద్ధమైనవిగా పేర్కొంటూ తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం తగదని అన్నారు.