News

త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తాం – నిర్మలా సీతారామన్

589views

రోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 24) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, పలు చట్టబద్ద, రెగ్యులేటరీ అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎంసీఏ సహా వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఐటీ రిటర్న్స్ గడువు జూన్ 30వ తేదీ వరకు..

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు మొదలు వివిధ అంశాలపై ఆర్థికమంత్రి భారీ ఊరట కల్పించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యమైతే అదనపు జరిమానా ఉండదని స్పష్టం చేశారు. 2018-19 ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని జూన్ 30,2020కి పొడిగించామన్నారు.

ఆధార్ – పాన్ కార్డ్ లింకింగ్

ఆధార్-పాన్ కార్డు లింకింగ్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఆధార్ – పాన్ లింకింగ్ తేదీ ఈ నెల చివరి వరకు ఉంది. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనిని పొడిగించారు.

జీఎస్టీ రిటర్న్స్ తేదీ పొడిగింపు

జీఎస్టీ రిటర్న్స్ తేదీని కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. దాదాపు అన్ని కీలక ఆర్థిక లావాదేవీలను కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగించి ప్రజలకు ఊరటనిచ్చారు.

వివాద్ సే విశ్వాస్

జూన్ 30కి వివాద్ సే విశ్వాసం స్కీం గడువును కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ స్కీంలో ఆలస్య రుసుమును 12 శాతం నుండి 9 శాతానికి తగ్గించారు.

కస్టమ్స్ అండ్ ఎక్సైజ్

కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపు డెడ్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇది కూడా జూన్ 30 చివరి తేదీ. కస్టమ్ క్లియరెన్స్ ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు 24 గంటల పాటు కొనసాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు.

వ్యాపారులకు ఊరట

రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులకు భారీ ఊరట. ఈ కంపెనీలకు లేట్ ఫీజు, పెనాల్డీ, వడ్డీని మినహాయించారు. రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీలకు వడ్డీని 9 శాతానికి తగ్గించారు.

త్వరలో ఆర్థిక ప్యాకేజీ

కరోనా మహమ్మారి కారణంగా త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది తుది రూపు దిద్దుకుంటోందన్నారు. కరోనా కారణంగా వివిధ రంగాలు కునారిల్లాయి. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి, ఆదుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.