ArticlesNews

ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం… మన భవిష్యత్తు కోసం

10views

( జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం )

ప్రకృతిలో వనరులు అపరిమితమైనవి కావని, అవి పరిమితమేనని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని భారతీయ ఆలోచనా విధానం. మనుషుల నిజమైన అవసరాలను పూర్తిచేయగల మేరకు మాత్రమే ప్రకృతిలో వనరులున్నాయి. అంతేగానీ, మనిషి తన అవాస్తవికమైన అవసరాలను, ఆశలను తీర్చుకోవడానికి ప్రకృతిని పీడించినట్లయితే.. ప్రకృతికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పరిమితమైన సాధనాలతో, అపరిమితమైన భోగం సాధ్యం కాదు. కాబట్టే మన పూర్వీకులు ‘‘తేన త్యక్తేన భుంజీథా’’ అంటే..త్యాగ పూర్వకంగానే అనుభవించు – నీకు కేటాయించినదే నీవు అనుభవించు అని అర్థం. ఈ విధంగా మనల్ని ఆదేశించారు.

పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడానికి మరియు వాటిని పరిష్కరించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకునేలా ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భవిష్యత్తులో గణనీయమైన ముప్పును కలిగించే పర్యావరణ సమస్యల గురించి ప్రజలు తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలను ప్రధాన సమస్యల నుండి రక్షించడానికి సకాలంలో మరియు పటిష్టమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్ష్యం వైపు మొదటి అడుగు, పర్యావరణాన్ని పరిరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించడమే. ఈ సంవత్సరం “ప్రకృతి స్ఫూర్తితో. వాతావరణం కోసం. మన భవిష్యత్తు కోసం.” ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్థాపించింది. మానవ పర్యావరణంపై జరిగిన స్టాక్‌హోమ్ సమావేశం ప్రారంభంతో ఈ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. పర్యావరణ సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఈ సమావేశం నాంది పలికింది. మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1974 జూన్ 5న నిర్వహించారు, అప్పటి నుండి ఇది ఒక ప్రధాన ప్రపంచ కార్యక్రమంగా మారింది.

ఈనాడు ప్రపంచమంతా వాతావరణ కాలుష్యం గురించి వ్యాకులపడుతోంది. మనం రూపొందించే అభివృద్ధి మార్గం వారందరికీ దారి చూపగలుగుతుంది. హిందూ దేశం మీద ఓ పెద్ద బాధ్యత మోపబడి వుంది. ఎందుకంటే మన దగ్గర జీవన దృష్టి వుంది. మన దగ్గర తత్వజ్ఞానము వుంది. మన తత్వ జ్ఞానాన్ని ఆధునిక జ్ఞానం బలపరుస్తోంది. మన తత్వజ్ఞానము ద్వారా 3వేల సంవత్సరాలు ముందు మనవారు దర్శించి చర్చించిన విషయాలనే ఈనాటి శాస్త్రవేత్తలూ మాట్లాడుతున్నారు. ఆ భాషనే మీరు మాట్లాడుతున్నారు.

ఉపనిషత్తుల్లో మన పెద్దవారు ‘‘తదేజతి తన్నేజతి (అది కదులుతోంది, కదలటం లేదు కూడాను), తద్దూరే తదంతికే (అది దూరంగా వుంది. దగ్గరగా వుంది) తదంతరస్య సర్వస్య తద్ సర్వస్వాస్య బాహ్యతి (అది అందరిలోనూ వుంది. అందరికీ బయటనూ వున్నది) ఈ సమగ్రతతో కూడిన ఆలోచనా రీతి ఆధారంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస చిత్రాన్ని గతంలో మనం రూపొందించుకున్నాం. కాలం మారిన కారణంగా అదిప్పుడు కాలబాహ్యమైపోయింది. అయితే మన సిద్ధాంతం శాశ్వతమైంది. దాని ఆధారంగా ఓ నూతన వికాస మార్గాన్ని మనం రచించుకోవాలి. ఈ భూమి మీద నివసించే సమస్త మానవాళికి అన్ని రకాల సుఖసంతోషాలను అందజేసే పద్ధతిలో రూపుదిద్దుకోవాల్సిన బాధ్యత మన పై వుంది.

తిరిగి ఇవ్వకుండా మనం భూమి నుండి తీసుకుంటూ ఉండలేము. సుస్థిర జీవనం అనేది మన ప్రస్తుత అవసరాలకు మరియు రాబోయే ఏడు తరాల మనుగడకు మధ్య ఒక వారధి లాంటిది. ఇది ఈ గ్రహం మీద యజమానిగా కాకుండా, అతిథిగా ఉండటం లాంటిది. ఈ భూమిపై మన ఉనికిని ఒక భారంలా కాకుండా, ఒక ఆశీర్వాదంగా మార్చుకుందాం, తద్వారా సకల జీవులకు ఉజ్వలమైన మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిద్దాం.