
మానవాళికి శ్రీరాముడి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. విశాఖపట్నంలోని గాజువాక తుంగ్లాం గ్రామంలోని విజయరాఘవస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీనారాయణ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మనిషి జీవితంలో ప్రతిరోజు అద్దం ఎంత అవసరమో, మానవ సమాజానికి శ్రీరాముని ఆదర్శాలు కూడా అంతే అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాముడి మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. చినజీయర్ స్వామి రాక సందర్భంగా తుంగ్లాం గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. తుంగ్లాం నుంచి షీలానగర్ వరకు భక్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. షీలానగర్ వద్ద చినజీయర్ స్వామికి ఆలయ అర్చకులు, ప్రముఖులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





