News

కుజుమండి తింటున్న‌ట్టుగా కృష్ణుడి పోస్ట‌ర్‌.. క‌స్ట‌డీలోకి రెస్టారెంట్ ఓన‌ర్లు

46views

కేర‌ళ‌లో రెండు రెస్టారెంట్ల‌కు చెందిన ఓన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భ‌గ‌వానుడు కుజుమండి మాంసాహారం తింటున్న‌ట్లుగా ఇటీవ‌ల ఓ పోస్ట‌ర్ క్రియేట్ చేశారు. మ‌ల‌యాళం కొత్త సంవ‌త్స‌రం విషు సంద‌ర్భంగా ఓ రెండు రెస్టారెంట్లు ఆ పోస్ట‌ర్‌ను తయారు చేసి ప్ర‌చారం కోసం వాడుకున్నాయి. అరేబియ‌న్ నాన్‌వెజ్ వంట‌కం కుజుమండి డిష్‌ను కృష్ణుడి వ‌ద్ద ఉన్న‌ట్లు ఫోటో డిజైన్ చేశారు. ఈ కేసులో నిందితుల‌ను అర్ష‌ద్‌, షామ్నాస్‌గా గుర్తించారు. మెహ‌ర్ మండి అండ్ గ్రిల్స్ రెస్టారెంట్‌ను వాళ్లు న‌డుపుతున్నారు. బీఎస్ఎస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 192(కావాల‌ని రెచ్చ‌గొట్ట‌డం) కింద వారిని బుక్ చేశారు. ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్ కోసం ఆ ఫోటోను రెస్టారెంట్లు వాడాయి. హ్యాపీ విషు అని మెసేజ్ చేసి, కృష్ణుడి ముందు కుజుమండి డిష్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాల‌న్న ఉద్దేశంతో ఆ ఫోటోను షేర్ చేసిన‌ట్లు ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఏప్రిల్ 15వ తేదీన వాట్సాప్ స్టేట‌స్ రూపంలో ఆ ఇమేజ్‌ను షేర్ చేశారు. వివాదం నేప‌థ్యంలో రెస్టారెంట్ ఓన‌ర్లు ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.