
విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైన పురాతన శ్రీరాముని విగ్రహానికి సంబంధించి శాస్త్రోక్తంగా ‘స్వస్తి’ కార్యక్రమం నిర్వహించారు. రామతీర్ధంలోని కోటిపల్లి తీరంలో శ్రీరాముని విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఒక భావోద్వేగ ఘట్టంగా మారింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ శాస్త్రోక్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమ వివరాలిలా..
రామతీర్ధం కొండపై ఉన్న విగ్రహం గతంలో జరిగిన దాడిలో విరిగిపోయి, దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో దానిని సంప్రదాయ పద్ధతుల్లో గౌరవంగా నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోటిపల్లి తీరానికి విగ్రహ భాగాలను తరలించి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, నాగమాధవి, ఈశ్వరరావు, మార్కెఫెడ్ చైర్మన్ బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
పవిత్రమైన రామతీర్ధంలో జరిగిన ఘటన బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రామభక్తులు ఈ ఘటనతో ఆవేదన చెందారని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో దేవాలయాల భద్రతపై కూటమి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేవాలయాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.





