
అయోధ్యలోని 108 అడుగుల కళ్యాణ రాముని దేవాలయానికి సమర్పించనున్న సువర్ణ ధనస్సు దర్శనం ఎంతో పుణ్య ఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భక్తుల దర్శనార్దం సువర్ణ ధనస్సు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు బంగారు ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీబాల రామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు.
ఈసందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ సువర్ణ ధనస్సును అయోధ్య రామపరివార సమేత శ్రీకళ్యాణ రామమందిరం నిర్మాత చల్లా శ్రీనివాస శాస్త్రి (తెనాలి) సుమారు రూ 80 లక్షలతో తయారు చేయడం గొప్ప విశేషమన్నారు. కేజీ బంగారం, 13 కేజీల వెండితో 14 కేజీల సువర్ణ ధనుస్సును తయారు చేశారని అన్నారు. ఈ సువర్ణ ధనుస్సు కంచి పీఠంలో విజయేంద్ర సరస్వతి స్వామి, శృంగేరీ భారతీ తీర్థ స్వామి తదితర ముఖ్య పీఠంలో పూజలందుకుని భీమవరం రావడం ఎంతో శుభ పరిణామమన్నారు. సువర్ణ ధనస్సు త్వరలో అయోధ్యలో సరయూ నదీ తీరం వద్ద నిర్మితమౌతున్న 108 అడుగుల కళ్యాణ రాముని దేవాలయములో సమర్పించనున్నారన్నారు. ముందుగా సువర్ణ ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీబాల రామ పంచలోహ ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.





