News

పెరుగుతున్న ప్రకృతి సాగు

188views

గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో పూర్తి స్థాయిలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నారు. మరోవైపు మిశ్రమ సాగు పద్ధతిలో ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ పద్ధతి అమలు చేస్తూ పాక్షికంగా మిశ్రమ పంటల సాగుకు ప్రోత్సహిస్తూ నిరంతర ఆదాయ వనరులు కల్పిస్తున్నారు.

సేంద్రియ పద్ధతిలో క్రిమిసంహారక మందుల వాడకం, రసాయన ఎరువులతో కలిగే నష్టాలు వివరిస్తూ ఏపీసీఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రకృతి సాగు సిబ్బంది రైతుల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌ నాయుడు తెలియజేశారు. ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుదల నివారించి భూమిశుద్ధి చేసే కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. భూమి పొరల్లోని సూక్ష్మజీవులు,వానపాములను కాపాడడంతో పాటు భూసారాన్ని పెంచేందుకు సహకరించే సుస్థిర పద్ధతులను అలవరుస్తున్నామన్నారు. నవధాన్యాల సాగు పద్ధతిలో నిత్యం భూమిపై పచ్చదనం పెంచుతున్నట్లు వివరించారు.

ప్రకృతి సాగులో విధానాలు..
ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ,మూత్రంలో ద్రవామృతాలు, అందుబాటులోని ఆకులు, అలములతో కషాయాల తయారీతో ప్రకృతి వ్యవసాయం చేయించడాన్ని అలవర్చుతున్నారు. రైతుకు పంట పెట్టుబడి తగ్గించి, నికర ఆధాయానికి ఢోకా లేకుండా ఆరోగ్యవంతమైన వ్యవసాయం అలవర్చడం భూసారాన్ని కాపాడేందుకు సీడ్‌బాల్స్‌ పోలాల్లో జల్లించడంతో వర్షాకాలంలో అన్ని రకాల మొలకలు వచ్చి భూమి సారవంతాన్ని కాపాడుతుంది.నవధాన్యాల సాగు పేరున పది రకాల పంటలను పండించి అన్ని వేళల్లో పొలాల్లో పచ్చని పంటలు ఉండేలా పండిస్తున్నారు. సూర్యమండలం పేరున కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాల, ఆహార పంటలు వేసే విధానం విస్తృతం చేస్తున్నారు.

మహిళా సంఘాలకు ప్రోత్సాహం..
ఆరోగ్యకరమైన వాతావరణం,భూ సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. క్రిమిసంహారకాలు, రసాయనాలు వాడకుండా నివారిస్తున్నాం. అంతరించి పోతున్న పంటలను పునరుద్ధరించడం, భూ పొరల్లో సారవంతం పోకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించడానికి మార్గం సుగమం చేస్తున్నాం.-ఎం.శ్రావణ్‌కుమార్‌,డీపీఎం,ఏపీసీఎన్‌ఎఫ్‌,పార్వతీపురం మన్యం జిల్లా