News

ధర్మస్థలపై అసత్య ప్రచారం చేయించారు

184views

హిందూ ఆలయాలపై కాంగ్రెస్‌ పార్టీ అసత్య ఆరోపణలు చేయిస్తోందని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశికాంత్‌ సెంథిల్‌ తెరవెనుక ఉండి, యూట్యూబర్ల చేత ధర్మస్థల మంజునాథ ఆలయంలో హత్యలు జరిగాయని అసత్య ఆరోపణలు చేయించారని ఆయన తీవ్ర విమర్శచేశారు.

బళ్లారిలోని తన నివాసంలో బీజేపీ నాయకులతో కలిసి గాలి జనార్దన్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ శశికాంత్‌ సెంథిల్‌తోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా తెరవెనుక ఉన్నారని అరోపించారు. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏకి అప్పగిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ధర్మస్థలలో హత్యలు జరిగాయని, మృతదేహాలను పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ పారిశుధ్యకార్మికుడు వాస్తవాలను అంగీకరించాడని, కొందరి ఒత్తిడి కారణంగానే అసత్య ఫిర్యాదు చేశానని ఒప్పుకున్నాడని గుర్తు చేశారు.

అయితే, గాలి జనార్దనరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంటూ బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో శశికాంత్‌ సెంథిల్‌ శనివారం పరువునష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో యువతుల మృతదేహాలను పాతిపెట్టినట్టు అసత్య ఫిర్యాదు చేసిన మాజీ పారిశుధ్య కార్మికుడు చన్నయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.