News

ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి

127views

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రం ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని మంత్రి నారా లోకేశ్‌ సందర్శించారు. 1800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలోని శ్రీకాలభైరవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం ద్వారా చేపడుతున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీ ఆశీర్వాదం పొందారు.

మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీని మంత్రి లోకేశ్‌ సందర్శించారు. సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నట్లు మఠం నిర్వాహకులు తెలిపారు. ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదవాలనుకున్నా మఠం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని నారా లోకేశ్‌ కోరగా.. పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీ అంగీకారం తెలిపారు.