
అమెరికాలో ప్రవాస భారతీయులు, తెలుగువారు అధికంగా నివసించే డల్లాస్ పరిసర ప్రాంతమైన ఫ్రిస్కోలో మైసూరు అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరాడు.
ఆగష్టు 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహా కుంభాభిషేక వేడుకల్లో భాగంగా స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారికి తొలి అభిషేకం, హారతి కార్యక్రమాన్ని సచ్చిదానంద స్వామీజీ నిర్వహించారు. ఈ వారం రోజుల క్రతువులో భాగంగా నిర్వహించిన హోమాలు, యజ్ఞాలు, శ్రీచక్రపూజ, కలశాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా నలుమూలలు నుంచి, కెనడా నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేశారు.




