News

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రికులకు హెలికాప్టర్‌ సర్వీసులు ఉండవు.

311views

మరికొన్ని రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు. అయితే, ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్‌ సర్వీసులు ఉండవని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్‌ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని తెలిపింది.

కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అధ్యక్షతన జరిగిన భద్రతా సమావేశంలో డైరెక్టర్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, జమ్ము కశ్మీర్‌ ముఖ్య కార్యదర్శి అటల్ డల్లూ, డీజీపీ నళిన్‌ ప్రభాత్‌, నిఘా అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం జులై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్‌నాథ్‌ యాత్ర మార్గాలను ‘నో ఫ్లై జోన్‌లు’గా జమ్ము ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జులై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.