
వార్షిక అమర్నాథ్ యాత్రకోసం భద్రతా చర్యలను పెంచడంలో భాగంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర వెళ్లే అన్ని మార్గాలను ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ హోం శాఖ మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్జీ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
భక్తులు అమర్ నాథ్ యాత్రకు పహల్గాం మార్గంతో పాటు బాల్తాల్ మీదుగా వెళ్తుంటారు. ఈ మార్గాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూలై 1 నంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. 38 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 8వ తేదీతో ముగుస్తుంది. నో ఫ్లయింగ్ జోన్లు ప్రకటించిన మార్గాల్లో యూఏవీలు, డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించారు. అయితే అత్యవసర వైద్య తరలింపు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘా వంటి సందర్భాల్లో ఈ ఆంక్షలు వర్తించవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్ర కోసం ఈ ఏడాది వివిధ కేంద్ర పోలీసు బలగాలకు చెందిన 581 కంపెనీలను మోహరిస్తున్నారు. తొలిసారి అమర్నాథ్ యాత్రకు ఎస్కార్ట్గా ఉండే సీఏపీఎఫ్ కాన్వాయ్ పరిరక్షణ కోసం జామర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.





