
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కొంతమంది భక్తులు కాలినడకగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.
20 ఎలక్ట్రిక్ బస్సులు..
కాలినడకన తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనుంది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని తెలియవచ్చింది.





