
పహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. యుద్ధ భయాలు నెలకున్నాయి. భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ నేతలు తమ నోటికి పనిచెబుతున్నారు. అసలు భారత్, పాక్ మధ్య యుద్ధం అంటూ జరిగితే కశ్మీర్ వల్లేనని 1993లో సీఐఏ అధికారి బ్రూస్ రైడెల్ భావించారు. అప్పటి బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఆయన ఓ నివేదిక సిద్ధం చేశారు. అప్పటి సీక్రెట్ నివేదికలో పాక్ అభద్రత, భయాలను పేర్కొన్నారు.
తమ కంటే ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా ఉన్న భారత్ను చూసి పాక్ భయానికి గురవుతోందని అభిప్రాయపడ్డారు. బలమైన భారత్ తన ఉనికికే ముప్పు అని పాక్ భావిస్తున్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి 20 శాతం అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, వేగంగా ఎదుగుతున్న భారత్ను చూసి భయానికి గురైన స్థితిలో పాక్కు యుద్ధానికి దిగే అవకాశం ఉందని తెలిపారు. ఓ తప్పుడు అంచనా, రెచ్చగొట్టే చర్యలు, ప్రతిదాడులు.. ఓ భారీ ఉగ్రదాడి వంటివి పాక్, భారత్ యుద్ధానికి దారి తీయొచ్చని భావించారు. ఇందుకు కశ్మీర్ పరిస్థితులు కారణం కావొచ్చని కూడా అన్నారు.
భారత్పై ఉగ్రమూకలను రెచ్చగొట్టడమే పాక్ ప్రధాన వ్యూహమని కూడా సదరు సీఐఏ ఏజెంట్ చెప్పారు. అంతర్గత కుమ్ములాటలతో దేశం అస్థిరంగా మారిన పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్కడి ప్రభుత్వం ఇస్లామిక్ పాలన వైపు కూడా మళ్లొచ్చని అన్నారు. ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ప్రయోగ భయాలు ఎప్పటికీ ఉన్నవేనని అన్నారు. అయితే, పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పరస్పర విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని, నేరుగా చర్చల కోసం హాట్లైన్ ఏర్పాటుతో పాటు అణ్వాయుధాలపై ఒప్పందం అవసరమని అన్నారు.
భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చేసేందకు ఇప్పటికే ఇరాన్, సౌదీ అరేబియా ముందుకు వచ్చాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా భారత్, పాక్ మంత్రులకు ఫోన్ చేశారు. పరిస్థితులు సద్దుమణిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు.




