
నవకార్ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నవకార్ మహామంత్ర దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
సందర్భంగా ప్రధాని మోదీ నవకార్ మహామంత్రానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది జైనమతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణిస్తారని, ఇది ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనమంతా శాంతి, మానసిక శక్తి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
‘నవకార్ మహామంత్ర దివస్’ మహావీర జయంతికి ఒక రోజు ముందు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన పౌరులు నవకార్ మహామంత్రాన్ని సామూహికంగా జపించారు. ఇది ప్రపంచ ఐక్యత, ఆధ్యాత్మిక జాగృతిని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది. ఈ మంత్రం జైనమతం(Jainism)లోని ఐదు ప్రధాన ఆరాధనా విభాగాలైన అరిహంతులు (మోక్షం పొందిన ఆత్మలు), సిద్ధులు (పరిపూర్ణ జ్ఞానం పొందినవారు), ఆచార్యులు (ఆధ్యాత్మిక గురువులు), ఉపాధ్యాయులు (ఉపదేశకులు),సాధువులు (సన్యాసులు)కు మనమిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో ఏకకాలంలో జరిగింది. భారతదేశంలో 6,000 ప్రదేశాలలో ఈ ఉత్సవం నిర్వహించారు. దీనిని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ఆధ్వర్యంలో నిర్వహించారు.





