News

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా

477views

మయన్మార్‌ నుంచి అక్రమంగా హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్‌ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించారు.

మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్‌ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్‌ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్‌ హ్యాండ్‌ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా… మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు.

పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.