ArticlesNews

‘నా పేరు ఆజాద్‌.. స్వాతంత్ర్యం నా తండ్రి’

234views

( ఫిబ్రవరి 27 – చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి )

చంద్రశేఖర్ ఆజాద్.. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన యువకెరటంగా పేరొందిన ఆయన వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలను గుర్తుచేసుకుందాం.

చంద్రశేఖర్ చాలా చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం వహించారు. 1922లో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించడంతో ఆజాద్ కాంగ్రెస్ తీరుపై నిరాశచెందారు. దీని తరువాత ఆయన 1924లో పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ సన్యాల్, యోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరారు. దీనిలో చంద్రశేఖర్ తొలుత రామ్‌ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 1925లో కాకోరి ఘటనలో చురుకుగా పాల్గొన్నారు.

చంద్రశేఖర్ 1928లో లాహోర్‌లో బ్రిటిష్ పోలీసు అధికారి ఎస్పీ సాండర్స్‌ను కాల్చి చంపి, లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది విజయవంతం కావడంతో చంద్రశేఖర్‌ బ్రిటిష్ ఖజానాను దోచుకుని, హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు నిధులు సమకూర్చారు. వీటిని విప్లవాత్మక కార్యకలాపాలకు వినియోగించేవారు. ఈ సంపద భారతీయులదని,దీనిని బ్రిటిష్ వారు దోచుకున్నారని చంద్రశేఖర్‌ తరచూ అనేవారు.

‘ఆజాద్‌’ పేరు వెనుక..
చంద్రశేఖర్‌కు ‘ఆజాద్’ అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆయన 15 ఏళ్ల వయసులో ఏదో ఒక కేసులో న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అక్కడ, న్యాయమూర్తి అతనిని పేరు అడిగినప్పుడు.. ‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు’ అని చెప్పారు. ఈ మాట విన్న న్యాయమూర్తి ఆగ్రహించి, చంద్రశేఖర్‌కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్‌ పేరు ఆజాద్ అయ్యింది. చంద్రశేఖర్ జీవితాంతం స్వేచ్ఛను కోరుకున్నారు.

బ్రిటిషర్లతో పోరాడటానికి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో సుఖ్‌దేవ్, అతని ఇతర సహచరులలో కలిసి ఒక పార్కులో కూర్చుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం బ్రిటిష్ పాలకులకు తెలిసింది. దీంతో బ్రిటిష్ పోలీసులు అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఆజాద్ పోలీసుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డారు. తాను బ్రిటిషర్లకు ఎప్పటికీ పట్టుబడనని, వారి ప్రభుత్వం తనను ఏనాటికీ ఉరితీయలేనని గతంలో ఆజాద్‌ పేర్కొన్నారు. అందుకే తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకుని, మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు ఆజాద్‌.