News

తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి

325views

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.

బాధితులు చికిత్స పొందుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రికి చేరుకున్న ఆదిత్యనాథ్‌ బాధితులను పరామర్శించడంతో పాటు, వారి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుందని, వారికి అవసరమైన ఇతర ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండదని సీఎం యోగి హామీనిచ్చారు. ఒక బాధితురాలితో సీఎం మాట్లాడుతూ దేనికీ ఆందోళన చెందవద్దని, వైద్యులు అంతా చూసుకుంటారని తెలిపారు.

మరో బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతుండటాన్ని గమనించిన యోగి ఇలాంటివారిని వారిని ఇళ్లకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది సీఎంతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ఏ బాధితుని పరిస్థితి విషమంగా లేదని, కొందరు బాధితులు కోలుకునేందుకు నాలుగువారాల సమయం పడుతుందని తెలిపారు.