
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం క్లోజ్ అయ్యింది. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగియడంతో సోమవారం (జనవరి 20) ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. పందళం రాజ కుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని తెలిపారు.
ఈ సీజన్లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి వచ్చిన హుండీ, కట్న కానుకల వివరాలను దేవస్థానం బోర్డు బహిరంగ పర్చలేదు. మండల-మకర విళక్కు వార్షిక పూజల సందర్భంగా 2024, నవంబర్ 16న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది.
దాదాపు రెండు నెలల పాటు ఈ పూజలు జరిగాయి. లక్షల మంది అయ్యప్ప భక్తులు, స్వాములు శబరిని దర్శించుకున్నారు. మకరజ్యోతి రూపంలో 2025 జనవరి 14న భక్తులకు దర్శనం ఇచ్చాడు అయ్యప్ప. అయ్యప్పస్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాష్టాల నుంచి పెద్ద ఎత్తన భక్తులు తరలి వెళ్లారు.





