News

భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు

219views

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించిందన్న వార్తలను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎస్‌) కొట్టిపారేసింది. బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ (బీజీబీ) దళాలు 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయంటూ బంగ్లా మీడియాలో వార్తలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా బాధ్యతారహిత, నిరాధారమైన కట్టు కథలని బీఎ్‌సఎఫ్‌ పేర్కొంది. ‘‘ఉత్తర 24 పరగణాల జిల్లా, రాంఘాట్‌ గ్రామంలోని బాగ్డా బ్లాక్‌లో ఉన్న భూభాగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు కొడలియా నదీ తీరం నుంచి వెళుతుంది. ఇరువైపులా కచ్చితమైన హద్దులను గుర్తించి స్తంభాలు పాతి, కంచె వేసి ఉంది. ఈ సరిహద్దు వెంట బీఎ్‌సఎఫ్‌ గస్తీలో ఎలాంటి మార్పు జరగలేదు’’ అని బీఎ్‌సఎఫ్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. భారత భూభాగాన్ని ఎవరూ ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని, తీసుకోలేరని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన మీడియాలోని కొన్ని వర్గాలు కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.