News

కుంభమేళాకు కొత్త వైరస్‌ ముప్పు.. అధికారులు అప్రమత్తం

391views

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్‌ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి జరగబోయే కుంభమేళాకు ఈ వైరస్‌ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్‌ను హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ) అని పిలుస్తారు. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్‌ బారిన పడినవారితో నిండిపోయాయి. ఈ వైరస్‌ సంక్రమణ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. తాజాగా భారత్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లక్షలాదిమంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్‌ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్‌ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముప్పును విస్మరించలేమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కుంభమేళాలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులలో ఉండేలా చూస్తున్నారు.

హెచ్‌ఎంపీవీ వైరస్ వల్ల ముందుగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికీ వ్యాపిస్తుంది. అయితే దీని ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019 నవంబర్‌లో కరోనా వైరస్ పుట్టినప్పుడు, అది ప్రపంచమంతటా పెను సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఎవరూ గ్రహించలేదు. నాడు ఈ వైరస్‌ను దాచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చైనా కుట్ర ప్రపంచానికి తెలిసిపోయింది. 2019 జనవరిలో తొలిసారిగా కరోనా భారతదేశానికి వచ్చింది. తరువాత వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆ ఏడాది మార్చిలో దేశంలో లాక్‌డౌన్ విధించారు. తాజాగా హెచ్‌ఎంపీవీ వ్యాప్తి దరిమిలా యూపీలోని అలహాబాద్ మెడికల్ అసోసియేషన్.. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ అవసరమని ప్రభుత్వానికి సూచించింది.