ArticlesNews

తమిళనాడు సేలంలో చోళుల కాలం నాటి శిలాశాసనం లభ్యం

253views

తమిళనాడులోని సేలం పట్టణంలో పెరుమాళ్ ఆలయం దగ్గర చోళుల కాలం నాటి 725 సంవత్సరాల పురాతనమైన శిలాశాసనం బైటపడింది. మూడవ కుళోత్తుంగ చోళుడి పరిపాలనా కాలంలో, సామాన్య శకం 1190లో ఆ శిలాశాసనాన్ని వేయించి ఉంటారని అంచనా. దాని ద్వారా సేలం ప్రాంతంలో చోళ రాజుల ప్రభావం గురించి తెలిసే అవకాశాలున్నాయి.

నిజానికి ఈ శిలాశాసనాన్ని యాదృచ్ఛికంగా కనుగొన్నారు. సేలంలోని నెతిమేడు ప్రాంతంలోని పెరుమాళ్ దేవాలయానికి స్థానికంగా ప్రజాదరణ ఉంది. ఆ ఆలయానికి చారిత్రకంగా, మతపరంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన గుడిలో కొన్ని దేవతా మూర్తులు కొంతకాలంగా కనిపించడం లేదు. శివుడు, మాత అంశాయి దేవతా మూర్తులు మాయమైపోయాయి. ఆ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు, రెవెన్యూ, ఆర్కియాలజీ విభాగాల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గుడి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నపుడు శిలాశాసనం లభ్యమైంది.

శిలాశాసనం ప్రాధాన్యం:
దక్షిణభారతదేశంలో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన రాజవంశాల్లో చోళ రాజవంశం ప్రధానమైనది. చోళరాజులు తమ పాలనా కాలంలో జరిగే వివరాలను, ధార్మిక కార్యక్రమాలను, విరాళాలను, పరిపాలనా విశేషాలను గురించి ఎన్నో శిలాశాసనాలు వేయించారు.

మూడవ కుళోత్తుంగ చోళుడు 12వ శతాబ్దపు ఉత్తరార్థ కాలానికి చెందిన రాజు. ఆయన పాలనా నైపుణ్యాలు, దక్షిణాపథంలో చోళ సామ్రాజ్య ప్రాభవాన్ని బలోపేతం చేయడానికి చేసిన కృషీ గొప్ప పేరు గడించాయి.

పెరుమాళ్ ఆలయం దగ్గర లభించిన శిలాశాసనం చోళుల పరిపాలన గురించి, కుళోత్తుంగ చోళుడి గురించి మరిన్ని వివరాలు తెలియజేయవచ్చు.

మాయమైన విగ్రహాల గురించి దర్యాప్తు:
పెరుమాళ్ ఆలయం నుంచి మాయమైన దేవతా మూర్తుల గురించి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాంస్కృతికంగా, ధార్మికంగా అమిత ప్రాధాన్యత ఉన్న శివుడు, అంశాయి మాతల మూర్తులు ఆలయంలోనుంచి మాయమవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చోళుల వారసత్వంపై ఆసక్తి:
సేలంలో శిలాశాసనం లభించడంతో తమిళనాడులో చోళ రాజుల వారసత్వం మీద ఆసక్తి పెరిగింది. చోళ రాజులు గొప్పగొప్ప ఆనకట్టలు, భారీ దేవాలయాలు నిర్మించారు. తమిళ సంస్కృతికి వారు చేసిన సేవ గురించి తమిళ సమాజంలో ఆసక్తి ఎక్కువే. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తున్న చోళుల కాలం నాటి శిలాశాసనాలు, పురాతన వస్తువులను పరిరక్షించేందుకు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.