News

‘పువర్తి’కి స్వాతంత్య్రపు ‘వెలుగులు’!

466views

పువర్తి.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని కీలకమైన మావోయిస్టు ప్రభావిత గ్రామం. అంతేకాదు హార్డ్‌ కోర్‌ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామం కూడా ఇదే! ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం లేదు. నేటికీ వారంతా కిరోసిన్‌ దీపపు కాంతుల నడుమే జీవిస్తున్నారు. ఇక టీవీ కూడా తెలియదు. పలు ఎన్‌కౌంటర్లు, మెరుపు దాడులు అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పువర్తిలో తొలిమారు పోలీసు క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో తొలిసారి జాతీయ జెండాను జవాన్లు ఆవిష్కరించారు. 2026 నాటికల్లా ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో నూటికి నూరుశాతం ప్రభుత్వ పఽథకాలు చేరవేయాలని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌సాయి ఆదేశించారు. ఈ క్రమంలోనే.. విద్యుత్‌ సౌకర్యం లేని మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించే దిశగా చర్య లు ముమ్మరంగా సాగుతున్నాయి. హిడ్మా ఇంటికి కూడా సౌర విద్యుత్‌ సరఫరా సౌకర్యం కల్పించారు. అంతేకాదు.. హిడ్మా ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీవీ ప్రసారాలను గ్రామస్థులు, చిన్నారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.