News

బంగ్లాదేశీ మతమూఢుల బెదిరింపులతో భారత్‌ వచ్చిన హిందూ అమ్మాయి

351views

తన కుటుంబానికి ఇస్లామిక్ మతమూఢుల బెదిరింపులు రావడంతో భయపడిపోయిన 17ఏళ్ళ బంగ్లాదేశీ హిందూ బాలిక సరిహద్దులు దాటి మరీ భారత్ వచ్చేసింది. కాలి నడకన పశ్చిమబెంగాల్‌ వరకూ వచ్చిన ఆ అమ్మాయిని బీఎస్ఎఫ్ జవాన్లు బెంగాల్ పోలీసులకు అప్పగించారు.

డిసెంబర్ 11 మంగళవారం రాత్రి 17ఏళ్ళ హిందూ అమ్మాయి బంగ్లాదేశ్ నుంచి కాలి నడకన భారతదేశానికి వచ్చేసింది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చేరుకుంది. అక్కడ ఆమెను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పట్టుకున్నారు. వారామెను బెంగాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తారు.

ఆ బాలికకు బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో కొంతమంది బంధువులు ఉన్నారు. వాళ్ళు పోలీసులకు ఆమె గురించిన సమాచారం అందించారు. బాలిక కుటుంబం బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళకు కొన్నాళ్ళుగా ఇస్లామిక్ మతమూఢుల గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. కుటుంబంలోని అందరినీ చంపేసి ఆ అమ్మాయిని ఎత్తుకుపోతామంటూ వారు బెదిరిస్తున్నారు. దాంతో తీవ్ర భయాందోళనలకు లోనైన బాలిక, శరణార్థిగా అయినా సరే భారతదేశంలో ఉండిపోవాలని తలచింది. వెంటనే నడుచుకుంటూ వచ్చేసింది.

బాలిక రాత్రివేళ కాలినడకన ఇరుదేశాల సరిహద్దుల దగ్గర బంగ్లాదేశీ గార్డులను ఎలాగోలా తప్పించుకుని భారత భూభాగంలోకి చొరబడిందని బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ఛోప్రా బ్లాక్‌లోని ఫతేపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లు ఆమె ఉనికిని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత బాలికను చోప్రా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇక ఆమె ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు.