News

భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం

180views

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మామూలుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. అయితే పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో, వారంతరాల్లో మాత్రం స్పర్శ దర్శనానికి అనుమతి నిరాకరిస్తారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే స్వామి వారి స్పర్శ దర్శనంపై ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎప్పుడూ కూడా స్వామి వారి స్పర్శ దర్శనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలంకు వచ్చిన భక్తులు స్వామి వారి స్పర్శ దర్శనం కల్పించే వెసులుబాటును కల్పించారు నూతన ఈవో.

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేస్తూ ఈఓ శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మారిన వేళలను మీడియాకు తెలియజేశారు ఈవో. ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పిస్తూ నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు. గతంలో శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ దేవస్థానం ప్రకటించింది. అయితే స్పర్శ దర్శనాలు కల్పించాలని తరచూ భక్తులు అధికారులకు వినతి చేస్తూ వచ్చారు. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే ఈవో అవకాశం కల్పించారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతలు అలంకార దర్శనం, మూడు విడతలు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో ప్రకటించారు. శని, ఆది, సోమవారంతో పాటు సెలవులో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ సర్పదర్శనానికి గతంలో మాదిరిగానే టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారానే పొందేలా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.