
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాలు, మత సంస్థలకు భద్రత కరవయిందని, వాటిపై దాడులు జరగడం విచారకరమని తెలిపింది. బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రి తన చర్చల్లో ఈ విషయాన్ని నిర్మొహమాటంగా తెలిపారు. ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తరువాత భారత ప్రభుత్వ ఉన్నతాధికారి పర్యటనకు రావడం ఇదే ప్రథమం. ఆయన బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీం ఉద్దీన్, తాత్కాలిక ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేయిన్లతో చర్చలు జరిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ దాస్ను అరెస్టు చేసిన తరువాత జరిగిన హింసను ప్రస్తావించారు. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్తోనూ భేటీ అయ్యారు. అయితే, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూనస్ మాట్లాడుతూ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు చేసిన విప్లవం భారత్కు నచ్చినట్టు లేదన్నారు. మైనార్టీలను వేధిస్తున్నారంటూ భారత్ మీడియా అతిశయోక్తులను ప్రచారం చేస్తోందన్నారు. .





