News

ఇంట్లో నుంచే ‘దేవ్‌ దిపావళి’ని చూడండిలా..

316views

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్‌ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్‌ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.

ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్‌ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్‌ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.

గంగా సేవా నిధి వెబ్‌సైట్‌ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్‌సైట్‌ ద్వారా దేవ్‌ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.

నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్‌లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్‌ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్‌లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.