
దీపావళి సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. తూర్పు లద్దాఖ్లోని దెప్పాంగ్, దేమ్చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉహసంహరణ ప్రక్రియ కొలిక్కి రావడం వల్ల గురువారం ఉదయం మిఠాయిలు అందించుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
“దీపావళి సందర్భంగా ఎల్ఏసీ వెంబడి అనేక సరిహద్దు పాయింట్ల వద్ద భారత్, చైనా సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అక్టోబర్ 25న మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. పెట్రోలింగ్ విధి విధానాలను ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయిలో స్థానిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వారే పెట్రోలింగ్ పద్ధతులను నిర్ణయిస్తారు” అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
అరుణాచల్ ప్రదేశ్లోని బమ్ లా, వాచా/కిబితు, లడఖ్లోని చుషుల్-మోల్డో, దౌలత్ బేగ్ ఓల్డి, సిక్కింలోని నాథు లాలలో ఎల్ఏసీ వెంట ఉన్న మొత్తం ఐదు బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బిపిఎమ్) పాయింట్ల వద్ద స్వీట్ల మార్పిడి జరిగింది. తూర్పు లడఖ్లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ పునఃప్రారంభం కోసం వేదికను సిద్ధం చేస్తూ, ఇరు పక్షాల దళాలు బుధవారం సేనల ఉపసంహరణను పూర్తి చేశాయి. ప్రక్రియ ధృవీకరణ భౌతికంగా అలాగే మానవరహిత వైమానిక వాహనాలతో జరుగుతుంది. ఉపసంహరణలో తాత్కాలిక నిర్మాణాల తొలగింపు ఉంటుంది.
మరోవైపు, వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తయిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ఇంతకు మించిన పురోగతిని భారత్ కోరుకుంటోందని, అందుకు కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరిపాయని వెల్లడించారు.





