
ఆఫ్గన్ లో తాలిబాన్ల అరాచక పాలన రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే మహిళల విషయంలో, ప్రజల విషయంలో పలు ఆంక్షలు విధించారు. తాజాగా… మహిళల విషయంలో మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటంపై నిషేధం విధించింది. ప్రార్థనా సమయంలో ఓ మహిళ గొంతు మరో మహిళకు వినిపించకూడదని, పాటలు పాడడం కూడా నిషిద్ధమంటూ హుకూం జారీ చేసింది. దీనిని బట్టి చూస్తే ఖురాన్ పఠించే సమయంలో కూడా గొంతు వినిపించొద్దు.తాలిబాన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఓ ఆడియోను విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కానీ.. ప్రాథమిక అవగాహన ప్రకారం మాత్రం మహిళలు తమలో తాము తప్ప, ఎవ్వరితోనూ మాట్లాడకూడదన్నట్లే. దీనిపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
మంత్రి విడుదల చేసిన ఆడియో ప్రకారం ఓ మహిళ నమాజ్ చేస్తున్నప్పుడు మరో మహిళ ఆమె పక్కన వుండే మహిళకి కూడా అది వినిపించొద్దని, అలాగే ఇతర సమయాల్లో కూడా ఈ హుకూం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.దీనిని బట్టి చూస్తే ఇక మహిళలకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే అర్థమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాగూ మహిళలు పురుషులతో మాట్లాడలేరు. తాజా నిబంధనలతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పరస్పరం మాట్లాడుకోలేరు. ప్రస్తుతానికి ఈ నిబంధనలు నమాజ్, ఇబాదత్ మొదలైన వాటికే పరిమితం అయినా.. రానూ రానూ ఇది విస్తరిస్తుంది.
మరోవైపు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తమ శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచాలని కూడా హుకూం జారీ చేశారు. ఇలాంటి నిర్ణయాలతో తాలిబాన్ సర్కార్ మహిళల హక్కులన్నింటినీ హరించివేసింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా మగవాళ్లకు కనిపించకుండా కప్పుకోవాలి. ఇక… కేవలం బయటే కాదు.. మహిళలు వారి ఇళ్లల్లో కూడా బిగ్గరగా మాట్లాడకూడదని ఆదేశించింది. ప్రపంచమంతా సాంకేతికంగా బాగా విస్తరిస్తున్న సమయంలో తాలిబాన్లు మాత్రం కనీసం గొంతు వినిపించకుండా నొక్కేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రపంచ దేశాలు వెంటనే ప్రభుత్వ హుకూంపై జోక్యం చేసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.





